- వాస్తవ దిగుబడి 35 క్వింటాళ్ల పైనే
- మిగిలిన మక్కలు ప్రైవేట్లో అమ్మకం
- క్వింటాల్కు రూ.650 దాక లాస్
- సీలింగ్ ఎత్తేయాలని రైతుల డిమాండ్
మంచిర్యాల, వెలుగు:ప్రభుత్వం మక్కల కొనుగోళ్లపై ఎకరానికి 26.50 క్వింటాళ్ల సీలింగ్ విధించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఈ సీజన్లో ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైతులు తాము పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి సెంటర్లకు తరలిస్తున్నారు.
సీలింగ్ కారణంగా వారికి చుక్కెదురవుతోంది. ఎకరానికి 26.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో మిగులు పంటను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 కాగా, వ్యాపారులు రూ.1,750 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.650 దాక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
మంచిర్యాల జిల్లాలో ఈ సీజన్లో 7వేల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేశారు. సాధారణంగా ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున 2.10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు. కానీ, వాస్తవ దిగుబడి అంత కంటే 5 నుంచి 10 క్వింటాళ్లు ఎక్కువగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. మక్కల సేకరణ కోసం మార్క్ఫెడ్ సహకారంతో జిల్లావ్యాప్తంగా ఐదు సెంటర్లు ఓపెన్ చేశారు. వాటికి అనుబంధంగా గ్రామాల్లో సబ్ సెంటర్లను ప్రారంభించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎకరానికి 26.50 క్వింటాళ్ల సీలింగ్ వల్ల రైతులు మిగిలిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. దండేపల్లి మండలానికి చెందిన ఒక రైతు ఐదు ఎకరాల్లో మక్క వేయగా, ఎకరానికి 35 క్వింటాళ్ల చొప్పున 175 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ మక్కలను సెంటర్కు తరలించాడు.
అధికారులు క్రాప్ బుకింగ్ డేటా ప్రకారం ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున ఐదెకరాలకు 132.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన 42.50 క్వింటాళ్లను ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నాడు. వారు క్వింటాల్కు రూ.1,750 చెల్లించారు. ఈ లెక్కన రైతుకు రూ.27,625 నష్టం జరిగింది. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
వ్యాపారులకు ‘మద్దతు’
కొంత మంది వ్యాపారులు రైతుల దగ్గర కొనుగోలు చేసిన మక్కలను తిరిగి మార్క్ఫెడ్ సెంటర్లలో మద్దతు ధరకు అమ్ముతూ భారీగా లబ్ధి పొందుతున్నారు. వ్యాపారులు తమకు అనుకూలంగా ఉండే రైతుల నుంచి పట్టా పాస్బుక్లు, ఆధార్ కార్డులు సేకరించి వారి పేరిట సెంటర్లలో అక్రమంగా మక్కలు అమ్ముతునారు.
సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కై ఈ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు. రైతుల విషయంలో క్రాప్ బుకింగ్ డేటా ప్రకారం కొనుగోలు చేస్తున్న సెంటర్ల నిర్వాహకులు, వ్యాపారుల విషయంలో మాత్రం నిబంధనలకు పాతరేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎంక్వైరీ జరిపితే మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.
సీలింగ్ వల్ల నష్టపోతున్నాం..
ఈ సీజన్లో 8 ఎకరాల్లో మక్కలు ఏసిన. ఎకరానికి 35 క్వింటాళ్ల చొప్పున 280 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సెంటర్కు తీసుకొచ్చి 15 రోజులు అయితుంది. ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున 212 క్వింటాళ్లు మాత్రమే కొంటున్రు. మిగిలిన 68 క్వింటాళ్ల మక్కలు బయట అమ్ముకోవాల్సిందే. వ్యాపారులు రూ.1,750 కంటే ఎక్కువ రేటు పెడ్తలేరు. సీలింగ్తో నేనే రూ.44,200 నష్టపోతున్న.
- గడిపెల్లి గణేశ్, కసిపెల్లి, దండేపల్లి మండలం-
సంచుల కొరతతో కొనుగోళ్లలో జాప్యం
రాష్ట్రవ్యాప్తంగా గన్నీ బ్యాగుల కొరత కారణంగా మక్కల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంచులు అందుబాటులో లేకపోవడంతో రైతులు వారం నుంచి పది రోజులకు పైగా సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. కాంటా వేసిన తర్వాత లోడ్ ఎత్తడానికి మరో వారం రోజులు పడుతోంది. సరిపడా లారీలు రాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది.
ఓ వైపు మబ్బులు రావడం, అకాల వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు సంచులు తెచ్చుకుంటే ఒక్కో బ్యాగుకు రూ.22 చొప్పున చెల్లిస్తామని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కానీ, మార్కెట్లో గన్నీ బ్యాగుల కొరత ఉందని, రూ.25 చెల్లిస్తామన్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 60 వేల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశామని, ఇంకా 50 వేల క్వింటాళ్ల వరకు రావచ్చని అధికారులు పేర్కొన్నారు.
